AP Minister Said Nandi Awards Announce Soon: చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో నంది పురస్కారం ఒకటి. సినీరంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కిస్తుంది. అయితే ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిస్తామని ఏపీ పర్యాటక శాఖ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆదివారం (మే 18) ఏలూరులో జరిగిన భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగానే విశాఖను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
అక్కడ స్టూడియోల నిర్మాణంతో పాటు డబ్బింగ్, రీరికార్డింగ్ వంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం ఒక కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక నటుడు (పవన్ కళ్యాణ్) డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. కొద్దిరోజుల్లో సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో ఏపీ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని, అప్పుడు చిత్రపరిశ్రమ అభివృద్ధి, నంది అవార్డుల గురించి చర్చిస్తామని చెప్పారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం పలు సినిమాల ను ంచి నామినేషన్స్ కూడా తీసుకున్నారు.