Karnataka High Court Warning: ఫేస్ బుక్ కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్.. ఎందుకో తెలుసా?

భారతదేశంలో ఫేస్ బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆదేశాలు జారీ చేస్తామంటూ కర్ణాటక హైకోర్టు ఫేస్‌బుక్‌కు హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులకు ఫేస్‌బుక్ సహకరించడం లేదని ఆరోపించిన నేపధ్యంలో కోర్టు ఈ హెచ్చరిక జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 07:28 PM IST

Karnataka High Court Warning: భారతదేశంలో ఫేస్ బుక్ కార్యకలాపాలను మూసివేయడానికి ఆదేశాలు జారీ చేస్తామంటూ కర్ణాటక హైకోర్టు ఫేస్‌బుక్‌కు హెచ్చరిక జారీ చేసింది. సౌదీ అరేబియాలో ఖైదు చేయబడిన భారతీయ పౌరుడి కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులకు ఫేస్‌బుక్ సహకరించడం లేదని ఆరోపించిన నేపధ్యంలో కోర్టు ఈ హెచ్చరిక జారీ చేసింది.

దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్బంగా జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కావాల్సిన సమాచారంతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా కోర్టు ముందు సమర్పించాలని బెంచ్ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది.తప్పుడు కేసులో భారతీయ పౌరుడిని అరెస్టు చేసిన కేసులో తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంగళూరు పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించిన విచారణ జూన్ 22కి వాయిదా పడింది.

కేసు ఏమిటంటే..(Karnataka High Court Warning)

తన భర్త శైలేష్ కుమార్ (52) సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, తాను తన స్వగ్రామంలో వారి పిల్లలతో నివసిస్తున్నారని కవిత తన పిటిషన్‌లో వివరించారు. 2019లో, అతను పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)కి మద్దతు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు అతని పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి సౌదీ అరేబియా రాజు మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేశారు.ఫేక్ అకౌంట్‌ని గుర్తించిన కుమార్ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కవిత మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దురదృష్టవశాత్తు సౌదీ పోలీసులు శైలేష్ కుమార్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు.

మంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, నకిలీ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్ నుండి అభ్యర్థించారు. అయితే, పోలీసుల విచారణపై ఫేస్‌బుక్ స్పందించలేదు. విచారణలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ 2021లో కవిత హైకోర్టును ఆశ్రయించారు.న్యాయపరమైన చర్యలతో పాటు, తన భర్త జైలు నుంచి విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కవిత కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.