Waqf Act cannot be suspended- Central Govt. said to Supreme Court: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా, పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతోపాటు కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలు వినిపించారు. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్తో కూడిన ధర్మాసనం మూడు రోజులపాటు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గట్టిగా వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టం లౌకికవాదంతో ముడిపడి ఉందని, పార్లమెంట్ ఆమోదించిన ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా భావించబడుతున్నందున దాన్ని నిలిపివేయలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది.
పిటిషనర్ల తరఫున హాజరైన కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. రాజ్యాంగ సూత్రాలను విస్మరించారన్నారు. చట్టం న్యాయవ్యవస్థేతర ప్రక్రియ ద్వారా వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఓ మార్గమని తెలిపారు. పిటిషనర్లు 3 అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. వక్ఫ్ బై కోర్ట్స్, వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్గా ప్రకించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం మూడు అంశాల్లో ఒకటి. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పునకు సంబంధించినది రెండో అంశం. ఎక్స్ అఫిషియో సభ్యులు తప్ప మిగిలిన సభ్యులందరూ ముస్లింలే ఉండాలన్నది పిటిషనర్ల వాదన. ఇక మూడోది వక్ఫ్ ఆస్తా లేక సర్కారు ఆస్తా అన్న విషయాన్ని నిర్ధారించడానికి కలెక్టర్ విచారణ చేపట్టిన తర్వాత ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనను పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారు.