India Cancelled Türkiye, Azarbaizen Travel: పహల్గమ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఉగ్రదాడిపై కోపంతో ఉన్న భారత్ పాకిస్తాన్, పాక్ అక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. 100 మందికిపైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడులను పలు దేశాలు ఖండించాయి. దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన అమాయకపు పౌరులు చనిపోయారని, పలువురు గాయపడ్డారని టర్కీ, అజర్ బైజాన్ దేశాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
‘పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ, అమాయక బాధితుల కుటుంబాలకు మేం సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అన్ని పక్షాలు సంయమనం పాటించాలి. దౌత్య మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని మేం కోరుతున్నాం’ అని అజర్ బైజాన్ తెలిపింది.
కాగా ‘పాకిస్తాన్ పై భారత్ జరిపిన దాడి పూర్తిస్థాయి యుద్ధ ప్రమాదాన్ని పెంచుతుందని టర్కీ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులతో పాటు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను మేం ఖండిస్తున్నాం’ అని టర్కీ తెలిపింది.
ఈ క్రమంలోనే ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించాయి. దీనిపై భారతీయ ట్రావెలింగ్ కంపెనీలు ఆ రెండు దేశాలకు షాకిచ్చాయి. టర్కీ, అజర్ బైజాన్ దేశాలు భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడి, పాక్ కు మద్దతు తెలపడంతో ఈజీమైట్రిప్ తన కస్టమర్లకు ఓ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. పర్యాటలకులు, ప్రజలు వీలైనంత వరకు ఆరెండు దేశాలకు వెళ్లొద్దని సూచించింది. అందుకు సంబంధించి ట్రావెల్ ఆఫర్లను రద్దు చేస్తున్నట్టు కాక్స్ అండ్ కింగ్స్ తెలిపింది.