Site icon Prime9

4 Laborers died in Rajasthan: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు చర్యలు.. ఊపిరాడక నలుగురి మృతి

Gold

Gold

4 Laborers Died in Rajasthan While Searching Gold: సెప్టిక్ ట్యాంక్‌లో బంగారం కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా, ఊపిరాడక నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జైపుర్‌లోని ఒక బంగారం షాపు యజమాని వికాస్ మెహతా బంగారం, వెండిని తమ సిబ్బంది ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. అదే సమయంలో అందులో కొంత బంగారం సెప్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయినట్లు గుర్తించారు. బంగారాన్ని బయటకు తీయాలని సోమవారం షాపు యజమాని 8 మంది కూలీలను అడిగారు. మొదట వారు నిరాకరించారు. బంగారు రజను తీసుకువస్తే అదనంగా డబ్బులు ఇస్తామని బంగారం షాపు యజమాని ఆశ చూపడంతో చివరికి అంగీకరించారు.

 

భద్రతా పరికరాలు తీసుకెళ్లలేదు..

సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగేటప్పుడు కూలీలు ఎలాంటి భద్రతా పరికరాలు తీసుకెళ్లలేదు. దీంతో గాలింపు సమయంలో ఊపిరాడక 8 మంది కూలీలు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు సింగ్, అర్పిత్ యాదవ్ అనే నలుగురు కూలీలు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండానే భూగర్భ సెప్టిక్ ట్యాంక్‌లోకి కార్మికులను పంపడంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దానిలో నిజంగా బంగారు రజను ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారం షాపు యజమాని, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

స్పందించిన మాజీ సీఎం అశోక్ గహ్లాత్‌..

ఈ ఘటనపై మాజీ సీఎం అశోక్ గహ్లాత్‌ స్పందించారు. సెప్టిక్ ట్యాంకుల్లోకి దిగి పారిశుధ్య కార్మికులు మృతిచెందిన ఘటనలు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నాయని చెప్పారు. సెప్టిక్ ట్యాంకులపే శుభ్రపరిచేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికుల భద్రతపై సర్కారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

 

Exit mobile version
Skip to toolbar