NDA MLAs meet Manipur Governor: మణిపూర్లో కొత్త సర్కారు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్.బీరేన్ సింగ్ సీఎం పదవికి ఫిబ్రవరి 13వ తేదీన రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్తచేతనావస్థలో ఉంది. ఈ క్రమంలోనే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధవారం రాజ్భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమ అభిప్రాయం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్ నిషికాంత సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఏర్పడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని తెలిపారు. దీంతోనే తాము గవర్నర్ను కలిశామని చెప్పారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలో కొత్త సర్కారు ఏర్పాటు అవుతుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పేపరును గవర్నర్కు అందజేసినట్లు చెప్పారు. మణిపూర్లోని ఎన్డీయే ఎమ్మెల్యేలు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. ప్రజామద్దతును కూడా తాము కోరుతున్నామన్నారు. 22 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, 10 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిశారని తెలిపారు.
గవర్నర్తో చర్చించాం : బీరేన్ సింగ్
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ను కలిసి చర్చించినట్లు మాజీ సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. గ్వల్తాబి ఘటనపై ప్రజలు ఆందోళన బాటపట్టారని, నిరసనకారులను ఆహ్వానించి చర్చలు జరపాలని కోరినట్లు చెప్పారు. ఇంఫాల్ వ్యాలీలో వారం రోజులుగా గ్వల్తాబి ఘటనపై ప్రజలు నిరసనలు సాగిస్తున్నారు. ఈ నెల 20న ఉఖ్రుల్ జిల్లాలోని శిరుయ్ లిల్లీ ఉత్సవ విశేషాలను కవర్ చేసేందుకు జర్నలిస్టులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సును భద్రతా సిబ్బంది ఆపారు. బస్సు విండ్షీల్డ్పై రాసి ఉన్న మణిపూర్ రాష్ట్రం పేరు కనిపించకుండా తెల్లకాగితంతో కప్పాలని బస్సులోని సిబ్బందిని బలవంతం చేశారు. ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్ గుర్తింపును అమానించిన గవర్నర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నిరసనకారులు ఆందోళనలకు దిగారు. మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది.