World beauties visited Nagarjuna Sagar: ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది ప్రపంచ సుందరీమణులు సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని సాగర్ను సందర్శించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలను వీక్షించారు. సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రత్యేక ఫొటో షూట్లో పాల్గొన్నారు. సాగర్లో సుమారు 4 గంటల పాటు పర్యటించారు.
మంగళవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు చార్మినార్ నుంచి లాడ్బజార్ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షించి షాపింగ్ కూడా చేస్తారు. చార్మినార్ చరిత్రను సుందరీమణులు తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్లో జరిగే స్వాగత విందులో పాల్గొనున్నారు. విందులో హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్ కీ ఘోష్, పనీర్ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్ జామూన్ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు.
యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా దేశాలకు చెందిన సుందరీమణులు ఉన్నందున వారి స్థానిక వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్లోని 4 ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఓ హోటల్కు ఆర్డర్ ఇచ్చారు.