3 Dead in Hayatnagar Accident: హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంట్లూరు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ ను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. కాగా ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇంటికి చేరుకోవడానికి కొన్ని సెకన్ల ముందే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంటికి 100 మీటర్ల దూరంలోనే దుర్ఘటన జరగడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా చనిపోయిన వారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన త్రినాథ్, వర్షిత్ గా గుర్తించారు. మరోకరని చంద్రసేనారెడ్డిగా గుర్తించారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో గడ్డపార సాయంతో బయటకు తీశారు. స్థానిక గ్రామానికి చెందిన యువకులు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.