Group-3 Results : తెలంగాణ రాష్ట్ర గ్రూప్-3 ఫలితాలను ఇవాళ టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ర్యాంకులను సైతం విడుదల చేసింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఫలితాలను చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూప్-3లో పురుషుల్లో టాప్ ర్యాంకర్కు 339.24 మార్కులు వచ్చాయని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-3 మహిళా టాప్ ర్యాంకర్కు 325.15 మార్కులు వచ్చినట్లు తెలిపింది. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్లు చెప్పింది.
మొదటి 50 ర్యాంకుల్లో నలుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్-3 అభ్యర్థుల లాగిన్ ఐడీలతో లాగి అయి.. ఓఎంఆర్ షీట్లు చూసుకోవచ్చని చెప్పింది. 2,49,557 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకులను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా, 2,69,483 (50.24 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, దాదాపు 49.76శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్- 1, గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయగా, తాజాగా గ్రూప్-3 ఫలితాలను రిలీజ్ చేసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఈ నెల 17న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను ఈ నెల 19న ప్రకటించనున్నారు.