Site icon Prime9

Mistakes in TG Inter Exam Paper: ఇంటర్ ప్రశ్నపత్రాల్లో మళ్లీ తప్పులు.. విద్యార్థుల్లో ఆందోళన

Inter Exams

Mistakes found in Telangana Inter Exam Papers: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. వరుసగా ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజూ ఏదో ఒక ప్రశ్నపత్రంలో తప్పులు ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లిష్, బోటనీ, గణితం ప్రశ్నపత్రాల్లో తప్పులు బయటపడుతున్నాయి. ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.

ఇంటర్‌ పరీక్షలు మొదటి రోజు ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ఒక క్వశ్చర్‌లో తప్పు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య మరిన్ని సబ్జెక్టులకు విస్తరించింది. ఇవాళ బోటనీ పేపర్‌లో 5,7 ప్రశ్నల్లో తప్పులు బయటపడ్డాయి. గణితం పేపర్‌లో నాలుగో ప్రశ్నలో పొరపాటు ఉంది. మంగళవారం జరిగిన పరీక్షల్లో కూడా మూడు పేపర్లలో తప్పులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదవుతున్నారు. అయినప్పటికీ ప్రశ్నపత్రాల్లో తప్పుల వల్ల తాము అనుకున్న విధంగా సమాధానాలు ఇవ్వలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కాగా, 25 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ ప్రథమ విద్యార్థులు 4,88,448 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. పరీక్షల కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో తప్పులను వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్ బోర్డు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేయగా, పరీక్ష కేంద్రాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. విద్యార్థులకు మంచి పరీక్షా వాతావరణం అందించాలనే ఉద్దేశంతో చేపట్టినా ప్రశ్నపత్రాల్లో తప్పుల వల్ల విద్యార్థులకు అశాంతి నెలకొంది.

ప్రశ్నపత్రాల్లో తప్పులు కొనసాగితే తాము అన్యాయానికి గురయ్యామన్న భావన విద్యార్థుల్లో పెరుగుతుంది. ప్రశ్నపత్రాల రూపొందింపు ప్రక్రియను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులు ఉన్న పేపర్లకు సంబంధించి విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar