Site icon Prime9

MLC Kavitha : జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నా : ఎమ్మెల్సీ కవిత పిలుపు

MLC Kavitha

MLC Kavitha

BRS MLC Kavitha : బీఆర్‌ఎస్‌‌లో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం మధ్యాహ్నం ఆమె తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లో కార్యక్రమం జరగనుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4వ తేదీన ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. అక్కడే కవిత మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ప్రస్తుతం కేసీఆర్‌ కుటుంబంలో కేటీఆర్, కవిత మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఆమె తన తండ్రి కేసీఆర్‌కు పంపించిన లేఖ లీక్‌ కావడం తెలంగాణలో సంచలనం రేపింది. తాజాగా కవిత కొత్తగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓవైపు కేసీఆర్‌ తనకు దేవుడు లాంటివాడని అంటూనే మరోవైపు పరోక్షంగా కేటీఆర్‌ను టార్గెట్‌ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. జూన్ 4వ తేదీన ధర్నా చౌక్‌లో ఆమె మాట్లాడబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

 

ఇటీవల తనకు సొంత ఎజెండా అంటూ ఏమిలేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయొద్దనేది తన వాదన అని ఆమె పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని అభిప్రాయపడ్డారు. తను జైల్లో ఉన్న సమయంలో బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలుపుతామని చెప్పారన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉండగా, ఇటీవల కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ముగ్గురు నేతలను ఆదేశించింది.

Exit mobile version
Skip to toolbar