Site icon Prime9

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఐటీలో తెలంగాణ నంబర్ వన్!

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy key statements on Telangana Development and Employment: ఐటీలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. రాజీవ్ యువవికాసం ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

 

ఈ సందర్భంగా సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ అభినందనలు తెలిపారు. సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్‌ రంగంతోపాటు అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌కు హబ్‌గా మారిందన్నారు.

 

అంతేకాకుండా, హైదరాబాద్.. ఏఐ, రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని చెప్పుకొచ్చారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలు, రైతులు, విద్యార్థులు,యువత, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి పాటుపడుతూనే పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. 2025లో దావోస్‌లో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులతో నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు.

 

అలాగే, రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్‌గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు స్వయం సహాయక బృందాలతో దాదాపు 66 లక్షల మహిళలకు సాధికారత, యువతకు రాజీవ్ యువ వికాసం ద్వారా వ్యాపారాలు, స్వయం ఉపాధికి నిధులను సైతం ప్రభుత్వం అందిస్తోందన్నారు.

 

హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ నగరం, డ్రై పోర్టు నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్, ఏపీ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీల నిర్మాణం జరుగుతోందన్నారు.

 

ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందన్నారు.

 

ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు. చివరగా హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారాలని, మన విజయాలను ప్రపంచానికి చూపాలని కోరారు.

 

Exit mobile version
Skip to toolbar