CM Revanth Reddy says Telangana Plays Key Role in National Defense: దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని మైదానంలో డీఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని, దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. బీడీఎల్, హెచ్ఏఎల్, మిథాని వంటి కీలకమైన సంస్థలు మన హైదరాబాద్లోనే ఉన్నాయన్నారు.
దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘విజ్ఞాన్ వైభవ్’వంటి సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థులకు దేశం పై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువగా ఐటీ కంపెనీలపై యువత మొగ్గు చూపుతోందని, సంప్రదాయ ఇంజినీరింగ్ వంటి విద్యపై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తాను కూడా కొన్నాళ్లు సన్స్ ప్రొఫెసర్గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. నోబెల్ గ్రహీత సీవీ రామన్ ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారని, అందుకే ఆయన గౌరవార్థం ప్రతీ ఏడాది జాతీయ సైన్స్ డేగా నిర్వహించుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రగతి, ఆవిష్కరణల్లో విద్యార్థులదే కీలక పాత్ర అన్నారు. దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉండాలని సూచించారు.