Raj Kasireddy : మద్యం కుంభకోణం కేసు పలువురు వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సిట్ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పటివరకూ సిట్ విచారణకు హాజరు కాలేదు. దీంతో కసిరెడ్డి ఎట్టకేలకు స్పందించి మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. మధ్యంతర రక్షణ కల్పించాలంటూ కసిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను కోర్టు వారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే రేపు (మంగళవారం) విచారణకు హాజరవుతానని ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు..
మద్యం కుంభకోణం కేసులో ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాగా, తర్వాత రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారని, ప్రస్తుతం తన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు సిట్ అధికారులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. తాజాగా న్యాయస్థానంలో అనుకూల తీర్పు రాకపోవడంతో విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.