Naga Babu MLC Nomination : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బలపర్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు, నామినేషన్ను బలపర్చిన నారా లోకేశ్, నాదెండ్లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదు స్థానాల్లో ఒక అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సమాచారం అందించారు. ఇందులో భాగంగా గురువారం నాగబాబుతో నామినేషన్ పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నారు.
ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపిస్తారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకున్నారు. ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ పార్టీ.. ఆ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని సూచనలు వచ్చాయి. నాగబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించనప్పటికీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు రావడంతో విరమించుకున్నారు. చివరకు సీఎం చంద్రబాబు మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ ఖరారు చేశారు.