Manda krishna Madiga : ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు నాయుడిదే కీలక పాత్ర అన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత బాబుదేనన్నారు. ఈ విజయం 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
వర్గీకరణ ఉద్యమంలో న్యాయం ఉందని, ఇందుకు ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనమన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడారు. ఇచ్చిన మాట కోసం ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. 1996లో మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు తొలిసారి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషిచేశారని కొనియాడారు. చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకొని 1997లో పాదయాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. మోదీ, అమిత్ షా, వెంకయ్య, కిషన్రెడ్డి తమకు అండగా నిలిచారని తెలిపారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ కూడా మద్దతు ఇచ్చారని చెప్పారు.
జగన్ మాకు అనుమతి ఇవ్వలేదు..
జగన్ అధికారంలో ఉంటే ఎస్సీ వర్గీకరణను చూసేవాళ్లం కాదన్నారు. కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు జగన్ తమకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాన్ని వైసీపీ ఇంకా చెప్పలేదని చెప్పారు. చంద్రబాబు చతురత వల్లే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సామాజిక న్యాయం చేశారని కొనియాడారు.