International Expert Team In Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సోమవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఈ మేరకు నేటి నుంచి అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించనుంది. అనంతరం జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు సలహాలు ఇవ్వనుంది.
ఇందులో అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డీసీకో, డేవిడ్ బి పాల్ ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటు పీపీఏ సభ్య కార్యదర్శి ఎం .రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు, సరబ్జిత్ సింగ్ భక్షి,రాకేష్ తోతేజ, అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సి ఎస్ ఎం ఆర్ ఎస్ అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.
ఈ మేరకు అంతర్జాతీయ నిపుణుల బృందం, అధికారులకు పోలవరం ప్రాజెక్ట్ సీఈఓ నరసింహ మూర్తి, ఎంఈఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్బాబు పనుల వివరాలను వివరించారు. అనంతరం నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రం వాల్ పనులు, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్టత పనులు పరిశీలించారు. కాగా, అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన నిపుణుల బృందం తొలుత జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.