Vidadala Rajini : గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని ఇవాళ మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని ఆరోపణలు చేశారు. ఎంపీ వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం, తన మరిదిని కూడా వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు.
కృష్ణదేవరాయలు 2020లో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్లో తమ అధికారాన్ని తమపై ప్రయోగించారని ఆరోపించారు. రజిని తనపై జరిగిన పోలీస్ దుర్వినియోగాన్ని వివరిస్తూ తన ఫోన్ కాల్ డేటాను తీసే ప్రయత్నం చేశారు. ఒక ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటా తీసే హక్కు ఎవరికి ఉంది? మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ల కాల్ డేటా తీస్తే మీ కుటుంబ సభ్యులు బాధపడరా? అని ప్రశ్నించారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
తనను భయపెట్టాలని చూస్తున్నారని, తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోలేదన్నారు. రాజకీయ విలువలు ఎవరి వద్ద ఉన్నాయో ప్రజలకు తెలుసు అన్నారు. తనకు రత్తయ్య అంటే గౌరవం ఉన్నప్పటికీ ఆయన కుమారుడు కృష్ణదేవరాయలు మాత్రం తప్పుడు మార్గంలో నడుచుకుంటున్నారని ఆరోపించారు. రజని టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, విజిలెన్స్ విచారణ చేయిస్తామంటున్నారు. ధర్నా చేస్తే తమపై కేసులు పెట్టించారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ దాడులను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.