Site icon Prime9

USA : హూతీలపై అమెరికా దాడులు.. 31 మంది దుర్మరణం

USA

USA : యెమెన్‌లోని హూతీలపై అగ్రరాజ్యం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా, 101 మంది గాయపడినట్లు హూతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

 

అగ్రరాజ్యం అమెరికా నౌకలు, విమానాలపై హూతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యూఎస్ ‘సెంట్రల్ కమాండ్’ పేర్కొంది. ఇక అమెరికా దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధం నేరంగా అభివర్ణించింది. యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.

 

తిరుగుబాటుదారులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ‘హూతీల సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దాడులు వెంటనే ఆపాలని కోరారు. లేకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ప్రపంచ జలమార్గాల్లో అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదన్నారు. హూతీలకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఇరాన్‌ను హెచ్చరించారు. వారి చర్యలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

 

హూతీలు గత దశాబ్దంగా యెమెన్‌లో పెద్దఎత్తున ప్రభావం చూపిస్తున్నారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా హూతీలు ఎర్ర సముద్రంలోని వ్యాపార నౌకలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్నారు. గతేడాది నుంచి హూతీలు అగ్రరాజ్యం అమెరికా యుద్ధ నౌకలపై 174 సార్లు, వాణిజ్య నౌకలపై 145 సార్లు దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సర్కారు ఇటీవల హూతీలను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించింది.

Exit mobile version
Skip to toolbar