Sunita Williams : 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సినీతా విలియమ్స్, బచ్ విల్మోర్లను మరికొన్ని గంటల్లో భూమిమీదకు రానున్నారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వీరు తిరుగు పయనమయ్యారు. రేపు తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. సునీతా, విల్మోర్తో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ క్రూ డ్రాగన్లో భూమిపైకి రానున్నారు. కాగా, స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది. తిరుగుప్రయాణం కోసం ఆస్ట్రోనాట్స్ తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్లో కూర్చున్న విజువల్స్ కూడా వైరల్గా మారాయి.
భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8.15 నిమిషాలకు క్రూడ్రాగన్ వ్యోమనౌక మూసివేత మొదలైంది. ఉదయం 10. 15 నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. రేపు (బుధవారం) 2. 41 నిమిషాలకు భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ ప్రజల్వన జరుగుతుంది. తర్వాత 3.27 నిమిషాలకు సాగర జలాల్లో వ్యోమనౌక దిగుతుంది. అనంతరం సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికితీస్తాయి. దిగిన తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటునందిస్తారు.
గతేడాది జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు వ్యోమగాములు వారం రోజులకు భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది. స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండా భూమి మీదకు చేరుకుంది. దీంతో 9 నెలలుగా ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకు వచ్చేందుకు నాసా స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ను ఐఎస్ఎస్కు పంపించింది. ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అయింది. దీంతో సునీతా, విల్మోర్ రాకకు మార్గం సుగమమైంది. వారితో మరో ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రానున్నారని నాసా తెలిపింది.