Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్ బర్గ్ టార్గెట్ ఎవరు?

అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికాకు చెందని రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది.

Hindenburg Research: అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికాకు చెందని రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది. త్వరలో మరో కీలక నివేదికను విడుదల చేయనున్నామని ప్రకటించింది. అయితే, ఆ నివేదిక దేనిపై అనే వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా నివేదిక ఎపుడు రిలీజ్ విడుదల చేస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేదు. కేవలం ‘త్వరలో మరో పెద్ద నివేదిక’అని మాత్రమే ట్వీట్‌ చేసింది.

నివేదికతో షేర్ల పతనం(Hindenburg Research)

హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లు భారీ ఎత్తున నష్టపోయిన విషయం తెలిసిందే. గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 140 బిలియన్‌ డాలర్లకు పైగా పతనమైంది. అంతకు ముందు గౌతమ్‌ అదానీ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో ఉండే వారు. నివేదిక తర్వాత గ్రూప్‌ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద సైతం కరిగిపోయింది.

అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2023 జనవరి 23న సుదీర్ఘ నివేదికను విడుదల చేసింది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్‌ దీవులు, మారిషస్‌, యూఏఈ.. లాంటి తదితర దేశాల్లో అదానీ కుటుంబం పలు నకిలీ కంపెనీలను నియంత్రిస్తున్నట్లు ఆరోపించింది.

వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌లోని మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు డజన్ల కొద్దీ వ్యక్తులతో మాట్లాడి, వేలకొద్దీ పత్రాలను, దాదాపు ఆరు దేశాల్లో కంపెనీ కార్యాలయాలను పరిశీలించాకే ఈ పరిశోధన నివేదికను వెల్లడిస్తున్నామని హిండెన్‌బర్గ్‌ అప్పట్లో తెలిపింది.