Tirumala Online Darshan Tickets Released: తిరుమల తిరుపతికి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలోని వైకుంఠ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు గంటలకొద్దీ క్యూలో నిల్చుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తిరుమలకు వస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి పలు సేవలకు సంబంధించి ఆగస్టు నెల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని సందర్శించేందుకు వీలుగా ఉచిత ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారిక వెబ్ సైట్లోనే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచిస్తుంది.