Terrorist Threat call to Team India Head Couch Gautam Gambhir: ఇండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, ప్రస్తుత ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇమెయిల్లో తనకు, తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. తన నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపు సందేశాలు కొన్ని రోజులుగా ఇమెయిల్ రూపంలో వచ్చినట్లు గౌతమ్ గంభీర్ పోలీసులకు వివరించారు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ సందర్భంగా విచారణ ప్రారంభించారు.
గంభీర్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం..
గౌతమ్ గంభీర్ నివాసం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గంభీర్ కుటుంబానికి పోలీసులు అదనపు రక్షణ కల్పించారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ ఇమెయిల్ మూలాన్ని గుర్తించేందుకు ట్రాకింగ్ పనులు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఇమెయిల్లు విదేశాల నుంచి, పాకిస్థాన్ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.