Prime9

Tamanna Bhatia as Brand Ambassador: మైసూర్ శాండిల్ సోప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్.. పెద్దఎత్తున విమర్శలు

Tamanna Bhatia as Mysore Sandal Soap Brand ambassador: కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్నాటక ప్రభుత్వ రంగ సంస్థ కర్నాటక సబ్బులు డిటర్జెంట్స్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో తయారయ్యే మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నటి తమన్నా భాటియాను నియమించింది. ఈ మేరకు రెండేళ్ల కాలానికి రూ. 6.2 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ అంశమే వివాదానికి కారణమైంది.

 

కాగా మైసూర్ శాండిల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను నియమించడంపై కర్నాటకలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానిక హీరోయిన్లు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి వంటి వారిని కాదని వేరే రాష్ట్రానికి చెందిన వారిని ఎందుకు నియమించారని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే తమన్నాను ప్రభుత్వం నియమించిందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి రష్మిక సహా పలువురు హీరోయిన్లు హాజరుకాలేదు. దీంతో స్థానిక యాక్టర్లను పక్కన పెట్టి వేరే ప్రాంతాల వారికి అవకాశం ఇచ్చారని.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

కాగా సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కర్నాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. కర్నాటక మార్కెట్ ను దాటి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా బ్రాండ్ ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా ఎఫెక్ట్, బ్రాండ్ కనెక్టివిటీ, యువతలో క్రేజ్ వంటి అంశాలను ఆలోచించి తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించామని చెప్పుకొచ్చారు. దీని వల్ల మైసూర్ శాండిల్ సోప్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తి 23 దేశాల్లో లభిస్తోందని, 2026 నాటికి 80 దేశాలకు తమ ఉత్పత్తులను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకే తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపును పెంచుకోవడంలో సాయపడుతుందని వివరించారు.

Exit mobile version
Skip to toolbar