Operation Sindoor: దేశంలోని పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులను అనుమతించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జన సంచారాన్ని నిషేధించారు.
సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యాసంస్థలు మూసివేశారు. పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్తో సహా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు చర్యలకు ఉపక్రమించాయి.దిల్లీలో 90 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం. రద్దైన విమానాల్లో 5 అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 27 విమానాశ్రయాలను మూసివేశారు.
పాకిస్తాన్కు చెందిన ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసింది. ఒక పైలట్ మన సైన్యానికి చిక్కాడు. అఖ్నూర్లో ఎస్-400 రక్షణ వ్యవస్థ ఆ విమానాన్ని కూల్చేసింది. పాక్ పంజాబ్ ప్రావిన్సులోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది.