7 Dead due to Heavy Rains in New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వడగళ్ల వాన కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు కూలిపోయి, రహదారులు జలమయమయ్యాయి. దీంతో ప్రధానమైన ఢిల్లీ- నోయిడా, ఢిల్లీ- ఘజియాబాద్, ఢిల్లీ- గురుగ్రామ్ హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కొద్దిరోజులుగా ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీవర్షం, వడగళ్ల వాన, బలమైన గాలులు ఢిల్లీని వణికించాయి. వాతావరణం చల్లబడి ప్రజలకు కొంత ఉపశమనం లభించినా.. పలు చోట్ల చెట్లు కూలిపోవడం, రోడ్లు మునిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే భీకర గాలుల ధాటికి పలుచోట్ల సైన్ బోర్డులు, టవర్లు నేలకూలాయి. తీవ్ర దుమ్ము తుపాను, భారీ వేగంతో వీచిన ఈదురుగాలులు ఢిల్లీని అతలాకుతలం చేశాయి.
ఢిల్లీ విమానాశ్రయంలో గాలి దూమరం విధ్వంసంతో విమానాలు దెబ్బతిన్నాయి. దీంతో విమాన రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి మెట్రోల్లో చిక్కుకుపోయారు. మరోవైపు భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఢిల్లీ నుంచి దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో భారీగా మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో 13 విమానాలను దారి మళ్లీంచారు. అందులో 12 విమానాలను జైపూర్ కు పంపగా, మరో అంతర్జాతీయ విమానాన్ని ముంబైకి మళ్లించారు.