TG High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ధర్మాసనం కొట్టివేసింది. భూసేకరణపై వెంటనే స్టే విధిస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లోని భూ సేకరణ నోటిఫికేషన్లో పేర్కొన్న మొత్తం 8 ఎకరాలపై కోర్టు అభ్యతరం వ్యక్తం చేసి స్టే ఇచ్చింది.
కాంగ్రెస్ సర్కారు మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు భూసేకరణ కోసం గత నవంబర్ 30న, డిసెంబర్ 1న రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, పులిచర్లకుంట తండా, రోటిబండ తండా పరిధిలో మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు కోసం 1,177 ఎకరాల భూసేకరణకు టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. 534 ఎకరాలు సర్కారు భూమి కాగా, 643 ఎకరాలు పట్టా భూమి ఉంది. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు భూసేకరణకు అంగీకరించారు. పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల, పులిచర్లకుంట తండాలో సర్వే పూర్తి కాగా, పోలేపల్లి గ్రామ రైతులకు నష్ట పరిహారం అందజేశారు. రోటిబండ తండా పరిధిలో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్న విషయం విదితమే.