CM Revanth Reddy Press Meet On Caste Census In Hyderabad: కులగణనపై నిపుణుల కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణన ఎప్పుడు చేస్తారో తేదీలతో సహా నిర్ణయించి ప్రకటించాలన్నారు. సర్వేలో భాగంగా ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు ఎలా అధిగమిస్తారో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలని చెప్పారు. మంత్రుల కమిటీతో పాటు, అధికారులతో కూడిన నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కులగణన సమాజ ఎక్స్రే లాంటిదని రాహుల్ చెప్పారన్నారు.
కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనిలో రాజకీయాలకు తావులేదని, కులగణన ఎప్పుడు చేస్తారో తేదీలతో సహా నిర్ణయించి ప్రకటించాలన్నారు. పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని చెప్పారు. బీసీల రిజర్వేషన్లకు 50 శాతం క్యాప్ తొలగించటంతోపాటు 42 శాతం కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.
రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారని, అందుకే కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేశారు. అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామన్నారు. అలాగే జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టామని, మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
మావోయిస్టులతో శాంతి చర్చలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హింసకు మేం వ్యతిరేకమని వెల్లడించారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారమని చెప్పుకొచ్చారు. మావోయిస్టులతో చర్చలు చేయాలన్నదే మా ఆలోచన అని పేర్కొన్నారు. జాతీయ పార్టీ కానుక మా కేంద్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాత మా నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే హింసను రాజ్యం, వ్యక్తులు, సంస్థలు చేసినా మంచిది కాదని చెప్పారు.