YS Vivekananda Reddy Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతిచెందారు. కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కడప రిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బుధవారం పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ మేరకు రంగన్న మృతిని డాక్టర్లు ధృవీకరించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైఎస్ వివేకా ఇంట్లో రంగన్న చాలాకాలం పనిచేశారు. వివేకానందారెడ్డి హత్య సమయంలో ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేకా కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు.
2019లో ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా తన ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లోని బాత్ రూంలో రక్తపు మడుగులో ఉన్న వివేకానందారెడ్డి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ క్రమంలోనే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి నుంచి కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు సీబీఐ అధికారుల చేతికి చేరింది. తర్వాత విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో పలువురు అరెస్టు కాగా, బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. వివేకా హత్య కేసులో 23 మందిని విచారించారు. ఈ క్రమంలో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తోంది.