Nara Lokesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 10వేల మందికి ఉపాధి అవకాశాలు

TCS to set up IT facility in AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రానున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీని దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్‌ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు.

లులు, ఒబెరాయ్‌, బ్రూక్‌ఫీల్డ్‌, సుజలాన్‌ తర్వాత టీసీఎస్‌ వస్తుండటంతో ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారుతోందన్నారు. ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నినాదంతో ఏపీ ముందుకు వెళ్తుందన్నారు.

ఈవీ, ఏరోస్పేస్‌, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని టాటా గ్రూపు తెలిపిందన్నారు. ఇందులో భాగంగానే టాటా గ్రూపు ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్‌ ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ రంగం, ఇతర రంగాల్లో అభివృద్ధిపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.