Site icon Prime9

Viveka Murder Case: వివేకా కేసులో కదలిక.. విచారణకు పలువురికి పిలుపు

YS Vivekananda Reddy Murder Case: కూటమి ప్రభుత్వ ఆదేశాలతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు పునర్విచారణ మొదలైంది. ఇందులో భాగంగా వైఎస్ వివేకానందరెడ్డి ఒకప్పటి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పోలీసు విచారణ ముమ్మరం చేశారు. విచారణకు రావాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డితో పాటు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బాబాయ్ వైఎస్​ మనోహర్‌రెడ్డి, తమ్ముడు అభిషేక్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

వైఎస్సార్ ట్రస్ట్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, న్యాయవాది ఓబుల్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వీరే కాకుండా మరో ఐదుగురు సాక్షులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు రావాలని పేర్కొన్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 15న కృష్ణారెడ్డి ఫిర్యాదుతో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదైంది.

ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుపై మళ్లీ విచారణ చేస్తున్న పోలీసులు పది రోజుల కిందట పీఏ కృష్ణారెడ్డి ఈ కేసు అంశంపై డీఎస్పీ మురళీనాయక్​ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. తాజాగా మరో పది మందిని విచారించేందుకు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వివేకా పీఏ కృష్ణారెడ్డి, బాధితులు విచారణ అధికారులపైనే ఎదురు కేసు పెట్టారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.

Exit mobile version
Skip to toolbar