Group 1 Mains: తెలంగాణలో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన.. రంగంలోకి దిగిన కేటీఆర్!

TSPSC Group 1 Mains exam Issue: తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. ఈ నెల 21 నుంచి జరగాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని రాత్రి అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టారు.

గతంలో జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షలో తప్పులు, జీఓ 29ను సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఒక్కసారిగా వందల మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10మందిని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. ‘రేపు మిమ్మల్ని కలుస్తానని.. అశోక్ నగర్‌లో లేదా తెలంగాణ భవన్‌లో ఎక్కడైనా సరే మిమ్మల్ని కలుస్తా’ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. ఈ మేరకు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.