Chhattisgarh encounter: హైఅలర్ట్.. ఛత్తీస్‌గఢ్‌లోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్.. 37 మంది మావోయిస్టులు మృతి

Security forces kill 37 Maoists in encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 37 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

ఈ ఆపరేషన్‌లో సీఆర్ఫీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1500 మంది పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఈ దాడి జరిగిన అనంతరం మావోయిస్టుల స్థావరాల్లో భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అయితే, ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, మృతుల్లో మావోయిస్టు జనరల్ సెక్రటరీ సంబళ్ల కేశవరావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్‌ అతిపెద్ద విజయమని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. మావోయిస్టుల నుంచి ఏకే 47, ఎల్ఎంజీ, ఎస్ఎల్ఆర్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్ సీజ్ చేశామని తెలిపారు.

దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను తరలిస్తున్నట్లెు భద్రతా దళాలు తెలిపాయి. మృతదేహాలను తరలించేందుకు ట్రాక్టర్లు తెప్పించారు. ఇందులో మొత్తం 37 మందిని గుర్తించగా.. 28 మృతదేహాలను దంతెవాడకు, 9 మృతదేహాలను నారాయణపూర్ తరలిస్తున్నారు. మృతుల ఫోటోలతోపాటు వివరాలను విడుదల చేయాలని పౌర సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.