PM Kisan: గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2వేలు.. ఇలా చెక్ చేసుకోండి!

PM Kisan 18th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పంట సాయం కింద అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున డీబీటీ రూపంలో రూ.20వేల కోట్లు జమ అయ్యాయి. ముంబై నగరంలో అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులు విడుదల చేశారు.

అయితే, రైతులకు ఆర్థికంగా చేయూత ఇవ్వాలనే సంకల్పంతో 2019 ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రతి ఏడాదికి రైతులకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం కింద అందిస్తుంది. ఏడాదికి మూడు విడతల్లో రూ. 2వేలు జమ చేస్తోంది. ఇటీవల 17వ విడత నిధులను జూన్‌లో విడుదల చేయగా.. 18వ విడత నిధులను శనివారం విడుదల చేశారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతులు నగదు వివరాలు తెలుసుకునేందుకు htttps://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులకు తెలిపారు.