Patnam Narender Reddy: ఉద్రిక్తత.. పోలీసులు అదుపులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే!

  • Written By:
  • Updated On - October 9, 2024 / 05:00 PM IST

Patnam Narender Reddy Arrest: తెలంగాణలో ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దుద్యాల మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలతో కలిసి పాదయాత్ర చేసేందుకు పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా.. మార్గమధ్యలో బొమ్మరాసపేటలోని తుంకిమెట్ల వద్ద పోలీసులు ఆయనను అడ్డగించారు. అనంతరం నరేందర్ రెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు.

తొలుత మహేశ్వరం నియోజకవర్గంలో 14వేల ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అయితే, ల్యాండ్ అక్యూవేషన్ పూర్తయిన తర్వాత ఫార్మా కంపెనీ ఏర్పాటు ఇక్కడ కాదని, దుద్యాల మండలంలో ఏర్పాటు చేయడం సరికాదని పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలతో కలిసి హకీంపేట్, అర్బీ తండా, లగచర్ల, దుద్యాల్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రకు పిలుపునిచ్చారు.

అయితే, పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ పాదయాత్ర చేసేందుకు యత్నించగా.. తుంకెమెట్ల వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అడ్డగించారు. పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు.