Israel continue Lebanon bombing: ఇజ్రాయెల్ దాడులు.. కీలక నేతల హతం

Israel’s Attacks Against Hezbollah in Lebanon Expand: ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక నేత సయీద్ అతల్లా మృతి చెందాడు. ఈ ఘటనలో సయీద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది.

ఇజ్రాయెల్ చేసిన దాడిలో హమాస్‌కు చెందిన ముఖ్య నేత సయీద్‌తో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్ మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. అయితే సయీద్ మృతితో హమాస్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హమాస్ సాయుధ విభాగానికి చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్‌కు చెందిన సయీద్ అతల్లా.. హమాస్ మిలిటరీ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బోల్లా నేత హసీమ్ సఫీద్దీన్ కూడా హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు హెజ్బోల్లా చీఫ్‌గా ఉన్న నస్రల్లా హతమైన తర్వాత అతడి దగ్గరి బంధువు అయిన హసీమ్ బాధ్యతలు స్వీకరించారు. హెజ్బోల్లా సెక్రటరీ జనరల్‌గా బాధ్యలు చేపట్టిన వారం రోజుల్లోనే హతం కావడం ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ పడినట్లయింది. కాగా, లెబనాన్ రాజధాని బీరుట్‌లో హసీమ్ తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలోనే హసీమ్ హతమైనట్లు సమాచారం.