Pawan Kalyan: టాటా పేరు చరిత్రలో నిలిచిపోతుంది.. సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan Mourns the Death of Ratan Tata: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా(86) అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రతన్ టాటా సేవలను కొనియాడారు. రతన్ టాటా ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచే మహోన్నత వ్యక్తి అని, ఆయన పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటన్నారు. దేశానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి ఆదర్శమని చెప్పారు.

టాటా అంటే భారతదేశ ఉనికి అని చెప్పేలా.. ఉప్పు నుంచి మొదులకొని అంతర్జాతీయ రంగం వరకు అణువణువులో టాటా పేరు ప్రతిధ్వనించేలా చేశారన్నారు. టాటా కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజసేవ చేశారని ట్వీట్ చేశారు.