CM Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే జాబ్స్ వస్తాయని ఆనాడే చెప్పా.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech At DSC Teachers Appointments: తెలంగాణ రాష్ట్ర పున: నిర్మాణంలో టీచర్ల పాత్రే కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. ప్రస్తుతం మిమ్మల్ని చూస్తే దసరా పండుగ ఇప్పుడే వచ్చినట్లు చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కొరివిదెయ్యం పాలించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశతో ఎదురుచేశారన్నారు. కానీ నిరుద్యోగుల సమస్యలను ఏనాడే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు చేశారు.

ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిప్తే మాకు కొలువులు వచ్చాయని, అందుకే మీకు కొలువులు కల్పిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 90 రోజుల్లో 30వేల ఉద్యోగులు కల్పించామని వెల్లడించారు. గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారని, నోటిఫికేషన్‌ ఇచ్చిన రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తి చేశారన్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారన్నారు. కేవలం 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.

తెలంగాణలో 30వేల పాఠశాలలు ఉండగా.. 24లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. ప్రైవేటు యాజమాన్యంలో 10 వేల పాఠశాలలు ఉంటే 34లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రభుత్వ బడికి వెళ్లేందుకు గ్రామాల్లో కూడా నామోషీగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలికి పోయిన వారు కూడా తాము తిన్నా తినకపోయినా, పుస్తెలు అమ్మి అయినా తమ పిల్లలను ప్రైవేటు బడి, కాన్వెంట్‌కు పంపాలనుకుంటున్నారని చెప్పారు.

నిరుపేదలు బంగారం అమ్మి ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపే పరిస్థితి మారాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకోసం మీరే కొత్తగా ఆలోచించాలన్నారు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వారిని భవిష్యత్తులో డాక్టర్లుగా, లాయర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదేనని టీచర్లకు సూచించారు. విద్యారంగానికి రూ.21వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేస్తున్నామన్నారు.

డీఎస్సీని ఆపాలని గుంట నక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయన్నారు. తెలంగాణ సమాజం మీద కేసీఆర్‌కు ఎందుకంత కోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏటా 1.10లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టాలు పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే తెలంగాణ యువత మత్తుకు బానిసలయ్యారు. వ్యసనాలకు బానిసలై.. యువత తప్పుదోవ పడుతున్నారున్నారు. ఇక, 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు బంగారు పతకాలు రావాలని పిలుపునిచ్చారు.