Haryana: హర్యానాలో కమలం హ్యాట్రిక్‌.. ఫలించిన మోదీ-షా ద్వయం!

Haryana: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హర్యానా, జమ్మూ – కశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో వరుసగా మూడో సారి భారతీయ జనతాపార్టీ విజయం కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సీనియర్‌ నాయకులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి, నయాబ్‌ సింగ్‌ షైనీని ఆ స్థానంలో కూర్చోబెట్టిన మోదీ-షా ద్వయం వ్యూహాలు ఫలించాయనే చెప్పాలి.

దీంతో హర్యాలో కమలం పార్టీ హ్యాట్రిక్‌ విజయం కైవసం చేసుకోవడానికి దోహదం చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి, 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్‌ పార్టీ కేవలం 36 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు పక్క రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్‌ లో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ పూర్తిగా ప్రభావం చూపలేకపోయింది.

ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ఈ ఒక్కరూ కూడా కనీసం పోటీ చూపకపోవడం గమనార్హం. కాగా, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యత చూపారు. అయితే సీఎం ఎవరనేదానిపై ఇంకా స్పష్టత కొరవడింది. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సీఎం షైనీ ప్రకటించారు. ఈ విజయం… ప్రధాని మోదీకే దక్కుతుందని తెలియజేశారు.

దేశంలో తీవ్ర ఉత్కంఠ సృష్టించిన జమ్మూ – కశ్మీర్ లో రాష్ట్ర హోదా పునరుద్ధరణ తరువాత జరిగిన ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. ఇందులో 90 అసెంబ్లీ స్థానాలకు గాను నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి దాదాపు 50 స్థానాల్లో ముందంజంలో కొనసాగుతూ… ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విడిడివిగా పోటీ చేస్తున్న బీజేపీ, పీడీపీ వరుసగా 29, 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 9 స్థానాల్లో లీడ్‌ లో ఉన్నారు. నేషనర్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఒమర్‌ అబ్బుల్లా సీఎం పీఠాన్ని దక్కించుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హర్యానా ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. తీవ్ర ప్రభావం చూపిస్తుందనుకున్న జాట్ల ఆందోళన, నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన రైతుల అందోళన, ఢిల్లీలో స్టార్‌ రెజర్లు వినేష్‌ ఫొగాట్‌, భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ సహా పలువురు రెజర్లు చేపట్టిన నిరసన దీక్ష అగ్నివీర్‌ ఎంపికలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు అన్నీ ఓటర్లపై ప్రభావం చూపలేక పోయాయి.

ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్‌ నాయకత్వంలో చోటు చేసుకున్న అంతర్గత కుమ్మలాటను బీజేపీ అధిష్టానం ఓట్ల రూపంలో క్యాష్‌ చేసుకుందనే చెప్పాలి. మాజీ సీఎం భూపేందర్‌ హుడా, మరో సీనియర్‌ నాయకురాలు కుమారి శైలజ, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా సీఎం పీఠం నాదంటే నాదని కొట్టుకున్నారు.

అయితే ఎన్నికలు జరగక ముందే కీలక నేతలంతా కొట్టుకోవడం హర్యానా ప్రజలకు హస్తం పార్టీపై విసుగు తెప్పించడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. కర్టుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. హర్యానా అధికారం లోకి వస్తుందనుకున్న కాంగ్రెస్‌ పార్టీ పరాభవానికి ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.