Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఉదయం 8.54 గంటలకు భూ ఉపరితలం నుంచి 140 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
గత నాలుగురోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో నాలుగుసార్లు భూకంపం వచ్చినట్టు స్థానికులు అంటున్నారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం అందలేదు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మరోవైపు ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు సమాచారం. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు భూమి కంపించిందని, భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
అలాగే టిబెట్ లోనూ ఆదివారం రెండుసార్లు భూమి కంపించింది. మధ్యాహ్నం 1.14 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. మళ్లీ సాయంత్రం 5.07 గంటలకు 3.7 తీవ్రత రెండోసారి భూకంపం వచ్చిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు మయన్మార్ లోనూ ఆదివారం 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక ఇండోనేషియాలోనూ ఆదివారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. అలాగే మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లోనూ భూప్రకంపనలు వచ్చాయి. కొంతకాలంగా తరచూ భూమి కంపిస్తుడంటంపై శాస్తవేత్తలు, అధికారులు పరిశోధనలు చేస్తున్నారు.