Prime9

Chopper Crashes : ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. అనంతపురం ఎంపీ సోదరి మృతి

Chopper Crashes : ఉత్తరాఖండ్‌‌లో ఇవాళ ఉదయం హెలికాప్టర్‌ కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. అనంతపురం ఎంపీ సోదరి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

 

భగీరథి నది సమీపంలో కూలిన హెలికాప్టర్..
ఉత్తర కాశీలో గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ కూలింది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్‌ భగీరథి నది సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరు చికిత్స పొందుతూ దుర్మరణం చెందారు. మృతుల్లో అనంతపురానికి చెందిన ఎంపీ లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె భర్త భాస్కర్‌ (51) ప్రస్తుతం రుషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

సహాయక చర్యలు ముమ్మరం..
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar