Case Filed against Youtuber Ranveer Allahbadia: ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో బీర్ బైసెప్స్ హోస్ట్ రణ్వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడు చేసిన అశ్లీల వ్యాఖ్యలు వివాదస్పదంగా నిలిచాయి. దీంతో అతడిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడితో పాటు షోలో పాల్గొన్న మరో నలుగురిపై కూడా కేసు నమోదైంది. తాజాగా వారిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ షోలో తల్లిదండ్రులకు సంబంధించిన అసభ్యకరమైన ప్రశ్న అడగడంతో షోలో పాల్గొన్న వారితో పాటు యావత్ దేశం షాక్కు గురైంది.
ఇంతకి ఏం జరిగిందంటే.. ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రిత్ర్ సింగ్, అపూర్వ ముఖిజా, బీర్ బైసెప్స్ హోస్ట్ రణ్వీర్ అలహాబాదియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్వీర్ ఓ కంటెస్టెంట్ని అడిగిన ప్రశ్న వివాదస్పదమైంది. “మీ తల్లిదండ్రులు శ్రంగారంలో పాల్గొనడాన్ని జీవితాంతం చూస్తావా?” అంటూ అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు. అతడి కామెంట్స్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. డార్క్ హ్యుమర్ చేసే సమయ్ రైనా సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు రణ్వీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా తల్లిదండ్రులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని అతడిపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వివాదంలోపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సైతం స్పందించింది. ఇలాంటివి అసలు సహించలేనివని, ఈ షో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేఇసంది. రణ్వీర్తో పాటు ఇతర కమెడియన్లపై కూడా కేసు నమోదు చేయాలని న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు డిమాండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహరంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.
ఈ విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేఛ్చ ఉంది కానీ, అవి ఇతరుల హక్కులను ఉల్లంఘించేలా ఉండకూడదని హితవు పలికారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, అప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా దీనిపై స్పందించారు. రణ్వీర్తో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పాల్గొన్న ప్యానెలిస్టుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు తెలుపుతూ ట్విట్ చేశారు.