Last Updated:

YSR Lifetime Achievement awards: రేపే వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానం

విధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు వరుసగా రెండో ఏడాది “వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ - 2022” క్రింద అత్యున్నత పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు

YSR Lifetime Achievement awards: రేపే వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానం

Andhra Pradesh: వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, విశేష కృషి చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలకు వరుసగా రెండో ఏడాది “వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ – 2022” క్రింద అత్యున్నత పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి వై.ఎస్. విజయమ్మ ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు.

వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు ప్రదర్శించి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన 35 మంది వ్యక్తులు, సంస్థలను అవార్డులు వరించాయి. అందులో భాగంగా వ్యవసాయంలో 5, కళలు మరియు సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును ప్రధానం చేయనున్నారు. ఆయా రంగాల్లో సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషి చేసి, విశిష్టసేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకే అవార్డుల్లో రాష్ట్ర హైపవర్ స్క్రీనింగ్ కమిటీ పెద్దపీట వేయడం జరిగింది.

వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు లో భాగంగా కళలు, సంస్కృతి విభాగంలో దర్శకులు, నటులు, కళాతపస్వి డా. కె. విశ్వనాథ్, తన చిత్రాల ద్వారా సామాజిక చైతన్యం కలిగిస్తున్న దర్శకులు, సినీ నటులు ఆర్ నారాయణమూర్తి కి ఈ అవార్డు లభించింది. సాహిత్య రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ కు అవార్డులు వచ్చాయి. అదే విధంగా రాయలసీమకు సంబంధించిన ప్రసిద్ధ రచయిత డా.శాంతి నారాయణ కు ఈ అవార్డు లభించింది. మహిళా, శిశు సాధికారత విభాగంలో ప్రజ్వల ఫౌండేషన్, శిరీష రీహాబిలిటేషన్ సెంటర్ కు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది. విద్యకు సంబంధించి రిషి వ్యాలీ ఇన్ స్టిట్యూషన్- మదనపల్లి, జవహర్ భారతి ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్- కావలి, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి. పట్టాభిరామ్ కి ఈ అవార్డు లభించింది. మీడియా విభాగంలో భండారు శ్రీనివాసరావు, ఎం.సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎం.ఈ.వి. ప్రసాద రెడ్డిలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది. వైద్య రంగంలో అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం డా.సి.ప్రతాప్ రెడ్డి కి, తెలుగు వారందరికీ సుపరిచితమైన గొప్ప కంటి సంస్థ ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్, శాంత బయోటెక్ సంస్థ అధినేత డా. వర ప్రసాద్ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డా. డి. నాగేశ్వర్ రెడ్డి, కరోనా విపత్కర సమయంలో కోవాగ్జిన్ ద్వారా అందించిన సేవను గుర్తిస్తూ భారత్ బయోటెక్ సంస్థ అధిపతులు డా. సుచిత్ర యెల్లా మరియు డా. కృష్ణ యెల్లాకు, పరిశ్రమల విభాగంలో జీఎంఆర్ గ్రూప్స్ అధినేత గ్రంథి మల్లిఖార్జున రావుకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు లభించింది.

వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులో భాగంగా వ్యవసాయ విభాగంలో విశేష సేవలకు గుర్తింపుగా ఆదివాసి క్యాషూనెట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కు, కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, శ్రీ అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, అమృతఫల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కు, చిత్తూరు జిల్లాకు చెందిన కట్టమంచి కట్టమంచి బాలకృష్ణారెడ్డికి ఈ అవార్డు లభించింది. మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తూ కళలు, సంస్కృతి విభాగంలో రంగస్థల నటులు నాయుడు గోపి, కలంకారి నైపుణ్యంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన పిచ్చుక శ్రీనివాస్, హస్తకళా నైపుణ్యంలో షేక్ గౌసియా బేగంకి ఈ అవార్డు లభించింది. మహిళా, శిశు సాధికారత విభాగంలో దిశ యాప్ కు సంబంధించి ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం నిమిషాల్లో స్పందించి చొరవ చూపిన ఐదుగురు పోలీసులు రవాడ జయంతి, ఎస్.వి.వి. లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రమణ్యం, హజ్రతయ్య, టి.శ్రీనివాసరావు కు ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు లభించింది. విద్య విభాగంలో బ్యాంకింగ్ రంగంలో టెక్నో సేవలు అందించిన పి.దస్తగిరి రెడ్డికి ఈ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి: