Pakistan : స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు

Suicide attack on school bus : పాక్లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఓ పాఠశాల బస్సుపై ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులతోపాటు ఐదుగురు మృతిచెందగా, 38 మంది గాయపడ్డారు. వివరాలను అసోసియేటెడ్ మీడియా వెల్లడించింది. బలోచిస్థాన్ ప్రావిన్స్లోని ఖుజ్దార్ జిల్లాలో ఓ బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, దాడి జరిగిందని డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. దీంతో పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
బలూచ్ వేర్పాటువాద గ్రూపుల పనే?..
సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్స్ల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించలేదు. పోలీసులు మాత్రం బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఎక్కువ శాతాన్ని బీఎల్ఏనే చేసింది. గత మార్చిలో బలోచిస్థాన్లో రైలుపై జరిగిన దాడిలో బీఎల్ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు.
దాడిని ఖండించిన పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ..
దాడిని పాక్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. చిన్నారుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని ఆయన మృగాలుగా అభివర్ణించారు. వారు ఎటువంటి దయకు అర్హులు కారన్నారు. ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. బలోచిస్థాన్లో కొన్నాళ్లుగా వేర్పాటువాద హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. స్థానిక అధికారులు, భద్రతా దళాలు దాడులకు బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.