కరోనా పేషంట్ల చికిత్సలో ఉపయోగిస్తున్న ప్లాస్మా థెరపీ తో న్యూమోనియాతో బాధపడుతున్న వ్యక్తి కోలుకున్నాడు. దీనితో ఈ చికిత్స పట్ల వైద్యులు కూడ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్మాధెరపీ కరోనా కు ఉపయోగపడుతుందని ఇందులో సందేహం లేదని వారంటున్నారు. దీనికి సంభందించి వివరాలిలా వున్నాయి. .
కురుక్షేత్రకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి న్యూమోనియా కారణంగా తీవ్ర అస్వస్థతతో ఆక్సిజన్ థెరపీ అవసరమైన స్థితిలో చంఢీగర్ పీజీఐ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్సలు అందించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే అతడికి ఆక్సిజన్ థెరపీని నిలిపివేయడమే కాక క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
ఈ క్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ మాట్లాడుతూ.. ‘ఇది ఖచ్చితంగా మనందరికి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే వార్త. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వైద్యులందరికి అభినందనలు. పీజీఐఎమ్ఈఆర్లో ప్లాస్మా థెరపీతో కోలుకున్న మొదటి వ్యక్తి ఇతను. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి ప్లాస్మా థెరపీని అందించాలని సూచిస్తారు. ఈ ప్రయత్నం విజయవంతం అయ్యింది. దీని గురించి మరింత ప్రచారం చేయాల్సి’ ఉంది అన్నారు.
కరోనా పేషంట్ల పాలిట ఆశాదీపంగా కనిపిస్తున్న ప్లాస్మా థెరపీలో.. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగి నుంచి ప్లాస్మా తీసుకుంటారు. దీన్ని ‘కన్వలేసెంట్ ప్లాస్మా’ అంటారు. కరోనా వైరస్ సోకిన మొదటి దశలో ఈ ప్లాస్మా థెరపీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ప్లాస్మాలో ఉండే ప్రతిరోధకాల ద్వారా ఈ చికిత్స పనిచేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న రోగులు మాత్రమే ప్లాస్మాను దానం చేయడానికి అర్హులు. వీరి నుంచి సేకరించిన ప్లాస్మాను బ్లడ్ బ్యాంకులో నిల్వ వుంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్తో వచ్చే రోగుల చికిత్స కోసం వినియోగిస్తారు.