న్యూఢిల్లీ :కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా భయాలతో అతి ముఖ్యమైన జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది.ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది
పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు వైరస్ భయాలతో పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చు. అప్పుడు కూడా వాయిదా వేస్తారా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.