బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సోము వీర్రాజును నియమించారంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్చార్జ్ అరుణ్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన సోము వీర్రాజు విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుగ్గా వ్యవహరించారు.
1978లో జనతా యువమోర్చానగర ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రవేశం చేసిన వీర్రాజు 1980లో యువమోర్చా తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1982–1984 వరకు బీజేపీ జిల్లా కార్యదర్శిగా, 1987–90 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991–94 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994–96 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 1996–2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 2003 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
2006–13 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013 నుంచి జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్గా పనిచేశారు.
2015 నుంచి 2018 వరకు ఆయన శాసనమండలి బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు.
బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తి ఎదుగుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్లపాటు వివిధ పదవుల్లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు.