ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అందని ద్రాక్షగా మారి అందనంత దూరంలోకి వెళ్లిపోయిందని .జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. అర్ధరాత్రి ఎప్పుడో ఆన్లైన్లో ఇసుక బుకింగ్ ఓపెన్ చేసి రెండు నిమిషాల్లోనే క్లోజ్ చేస్తున్నారు. అసలు ఇసుక ఎవరికి వెళ్తుందో కూడా తెలియడంలేదు. ఇదేవిధంగా జరిగితే టీడీపీకి తగిలినట్లే వైసీపీకీ ఇసుకదెబ్బ తగిలి తీరుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. పలు అంశాలపై శనివారం వీడియో సందేశం ద్వారా ఆయన స్పందించారు.
గతఏడాది నుంచి ఇసుక సరిగ్గా దొరకడంలేదు. ఇసుక మాఫియా ఎక్కువైపోయింది. . కరోనా వల్ల పలు రంగాల్లో ఉపాధి దెబ్బతింది. వాటి పై ప్రభుత్వం దృష్టిపెట్టాలి
మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి..ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు(ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్ కేటాయించే విధంగా చట్టం చేసింది. ఈ చట్టాన్ని దేశం మొత్తం హర్షించింది. స్థానికంగా దీని అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించింది. ఈ ప్రభుత్వం రాగానే మొత్తంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసేసింది. ఒక్క కాపులకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఇవ్వాల్సిందే.
మోదీ తీసుకొనే కొన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండవు. కానీ అవి ఇచ్చే దీర్ఘకాల ప్రయోజనాలను చూస్తే ప్రశంసించకుండా ఉండలేం. ఎన్నో అగ్రరాజ్యాల మద్దతు కూడగట్టుకుని ఆర్థికంగా, మిలటరీపరంగా బలమైన చైనా దేశాన్ని, దాని దుందుడుకుతనాన్ని నిలువరించడం పెద్ద విజయం అని పవన్ అన్నారు. కరోనాకాలంలో తొందరపడి సినిమా షూటింగ్లు చేసుకున్నా కష్టమేనన్నారు.
ఆ మధ్యన కొంతమంది రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి షూటింగ్లకు అనుమతి పొందారు కానీ, షూటింగ్ చేసే పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. కరోనా, లాక్డౌన్ సమయంలో జనసైనికులు బాగా సేవ చేశారని, పార్టీ నిర్మాణం నిరంతర ప్రక్రియ అని అన్నారు.