ఆంధ్ర ప్రదేశ్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్ల హర్షకుమార్ ఎంపీ అయ్యారని, దళితులను హర్షకుమార్ మాస్క్లా వాడుకుంటున్నారని మంత్రి విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో దళిత నేతలు అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తే నోరు మెదపని టీడీపీకి ఇప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళితుల అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని,
అమరావతికి దళిత సమస్యలకు సంబంధం ఏమిటన్నారు. దళితులను ప్రభుత్వానికి దూరం చేయాలనే కుట్రతోను చంద్రబాబుతో కలిసి హర్షకుమార్ పని చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు. హర్షకుమార్ది దళిత ఎజెండా కాదని చంద్రబాబు, అమరావతి ఎజెండా అన్నారుఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్ అని పేర్కొన్నారు.
దళితులపై దాడుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించినంత వేగంగా ఏ సీఎం స్పందించలేదని మంత్రి విశ్వరూప్ అన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై తమ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు. దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని తెలిపారు. అత్యాచార ఘటనల్లో నిర్భయ, ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేసి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
టీడీపీ నేత హర్షకుమార్ దళితుల బాగుకోసం చేసిందేమీ లేదని అన్నారు. హర్షకుమార్ ఎంపీగా పోటీ చేస్తే పది వేల ఓట్లు కూడా రాలేదని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమారుడికి 600 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖ వెనుక హర్ష కుమార్ ఉన్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి అని దళితులకు ఒక ఉపముఖ్యమంత్రి, ఐదు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. వైస్సార్ చేయూత ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారని కొనియాడారు. హర్షకుమార్ను ప్రజలు జోకర్గా చూస్తున్నారని మంత్రి విశ్వరూప్ అన్నారు.
మరిన్ని వార్తలు చదవండి : ఏపీలో మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన గవర్నర్..!