ఆంధ్ర ప్రదేశ్ : వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక నూతన పాలసీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు గారు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ అయితే, జగన్ రెడ్డి గారు విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్. టీడీపీ హయాంలో పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో వైకాపా ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టింది.
ఐదేళ్ల టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోంది. 14 నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలే తప్ప వచ్చిన ఒక్క కంపెనీ అయినా ఉందా? అని లోకేష్ ట్వీట్ చేశారు.
14 నెలల్లో మీరేం చేశారో చెప్పాలని సీఎం జగన్ను మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో చంద్రబాబు అభివృద్ధికి బాటలు పరిచారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు తెచ్చాం, సాగు నీరు ఇచ్చాం, విద్యాసంస్థలు పెట్టాం. ప్రజా రాజధానిలో అభివృద్ధికి ప్రభుత్వ వెబ్ సైటే సాక్ష్యం. మాది అభివృద్ధి, వైసీపీది విధ్వంసం. 14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి జగన్ గారు అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు చదవండి : చేసిన స్కాములు ఒకటా రెండా:విజయసాయి రెడ్డి